పాకిస్థాన్, బంగ్లాదేశ్ ల‌ను భారత్‌లో విలీనం చేస్తామంటే మేం స్వాగతిస్తాం: ఎన్సీపీ

  • కరాచీ భారత్‌లో భాగం అవుతుందన్న ఫడ్నవీస్ వ్యాఖ్యలకు మద్దతు
  • బెర్లిన్ గోడే కూలగా లేనిది మూడు దేశాలూ ఒక్కటి కావా?
  • బీఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్, శివసేనతో కలిసి పోటీ చేస్తాం
కరాచీ భారత్‌లో భాగం అవుతుందన్న మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ చేసిన వ్యాఖ్యలను స్వాగతిస్తున్నట్టు ఎన్సీపీ ప్రకటించింది. ఎన్సీపీ నేత, మంత్రి నవాబ్ మాలిక్ నిన్న విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. కరాచీ కూడా భారత్‌లో కలిసిపోయే రోజు వస్తుందన్న ఫడ్నవీస్ వ్యాఖ్యలపై స్పందించారు. ఆయన వ్యాఖ్యలను తాము స్వాగతిస్తున్నామని పేర్కొన్న ఆయన.. పాకిస్థాన్, బంగ్లాదేశ్ కూడా భారత్‌లో విలీనం కావాలని తాము కోరుకుంటున్నట్టు చెప్పారు. ఆ ప్రయత్నాలంటూ జరిగితే తాము బీజేపీకి మద్దతు ఇస్తామన్నారు.

బెర్లిన్ గోడే కూలిందని, అలాంటిది పాకిస్థాన్, బంగ్లాదేశ్, భారత్‌లు ఎందుకు కలవవని ప్రశ్నించారు. ఈ మూడింటినీ కలిపి ఒకే దేశంగా మార్చాలని కనుక బీజేపీ భావిస్తే అందుకు తాము పూర్తి మద్దతు ఇస్తామన్నారు. బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంఎసీ) ఎన్నికల్లో శివసేన, కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేస్తామన్నారు. ఎన్నికలకు ఇంకా 15 నెలల సమయం ఉందన్న ఆయన తమ పార్టీ కోసం పనిచేసుకునే హక్కు ప్రతి పార్టీకి ఉంటుందన్నారు. ప్రతి పార్టీ అదే చేస్తుందన్నారు. తాము కూడా తమ పార్టీని బలోపేతం చేసుకుంటామని మాలిక్ అన్నారు.

India
Pakistan
Bangladesh
Maharashtra
Nawab Malik
Devendra Fadnavis

More Telugu News