చీమలను చంపబోయి.. సజీవదహనమైన యువతి!

  • చెన్నై అమింజికరైలో ఘటన
  • చీమలపై కిరోసిన్ పోసి నిప్పంటించిన సంగీత
  • మంటలు ఎగసిపడి సజీవదహనం
ఇంట్లో కుప్పలుగా చేరిన చీమలను చంపే ప్రయత్నంలో నిప్పంటించిన ఓ యువతి, ఆ మంటల్లోనే సజీవదహనమైంది. ఈ ఘటన తమిళనాడు రాజధాని చెన్నై అమింజికరైలో ఆదివారం నాడు జరిగింది. పోలీసులు వెల్లడించిన వివరాల్లోకి వెళితే, ఇక్కడి పెరుమాల్ ఆలయం స్ట్రీట్ కు చెందిన సత్యమూర్తి దంపతుల కుమార్తె సంగీత (27). ఆమె ఓ సంస్థలో సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా పనిచేస్తోంది.

ఇంట్లో చీమలు పెరిగిపోవడంతో వాటిపై కిరోసిన్ పోసి నిప్పు పెట్టింది. ఆ తరువాత మంటపై మరింత కిరోసిన్ పోసే క్రమంలో ఒక్కసారిగా ఆమె దుస్తులకు మంటలంటుకున్నాయి. దాంతో కేకలు పెడుతున్న ఆమెను తల్లిదండ్రులు, సోదరుడు రక్షించే ప్రయత్నం చేశారు. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినా, అప్పటికే శరీరంలో చాలా భాగం కాలిపోవడంతో, ఆమె కన్నుమూసింది. కేసును నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Fire Accident
Tamilnadu
Ants
Sangeetha

More Telugu News