Hyderabad: సాగర్ రహదారిపై అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లి, కుమారుడు దుర్మరణం

  • ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న టాటా సఫారీ వాహనం
  • తుర్కయాంజల్ పరిధిలోని రాగన్నగూడ వద్ద ఘటన
  • కారులో ఉన్న ఇద్దరి పరిస్థితి విషమం
Mother and son died in a road accident on Sagar road

హైదరాబాద్ శివారులో గత రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తల్లీకొడుకులు దుర్మరణం పాలయ్యారు. రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్ మునిసిపాలిటీ పరిధిలోని రాగన్నగూడ వద్ద సాగర్ రహదారిపై నిన్న అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. హైదరాబాద్ నుంచి ఇబ్రహీంపట్నంవైపు వెళ్తున్న టాటా సఫారీ వాహనం అదుపుతప్పి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో ద్విచక్ర వాహనం నుజ్జునుజ్జు అయింది. దానిపై ప్రయాణిస్తున్న తల్లీకొడుకులు అక్కడికక్కడే మృతి చెందారు.

మృతులను రాగన్నగూడలోని జీవీఆర్ కాలనీకి చెందిన సంరెడ్డి ప్రదీప్ రెడ్డి (19), అతడి తల్లి చంద్రకళ (48)గా గుర్తించారు. మరోవైపు, కారులో ఉన్న ఇద్దరు కూడా తీవ్రంగా గాయపడ్డారని, వారి పరిస్థితి కూడా విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం వారికి కామినేని ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News