Tamil Nadu: చెన్నైలో దారుణం.. వ్యాపారి ఇంట్లోకి చొరబడి దుండగుల కాల్పులు, ముగ్గురి మృతి

  • కలకలం రేపిన హత్యలు
  • ఆర్థిక లావాదేవీలే కారణం?
  • నిందితుడు రాజస్థాన్‌కు చెందిన బాబుసింగ్‌? 
Three died in gun shooting in Chennai

చెన్నైలోని ఓ వ్యాపారి ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు విచక్షణ రహితంగా జరిపిన కాల్పుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. పారిస్ కార్నర్‌లోని షావుకారుపేటలో జరిగిందీ ఘటన. ఇక్కడ వినయగ మాస్త్రీ వీధిలో అపార్ట్‌మెంట్‌లో దిలీప్ తలీల్ చంద్ (74) అనే వ్యాపారి కుటుంబంతో కలిసి నివసిస్తున్నారు.

నిన్న సాయంత్రం ఆయన ఇంట్లోకి ప్రవేశించిన గుర్తు తెలియని వ్యక్తులు ఒక్కసారిగా కాల్పులు ప్రారంభించారు. ఈ ఘటనలో దిలీప్ తలీల్, ఆయన భార్య పుష్పాబాయి (70), కుమారుడు శీర్షిత్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా తలీల్ చంద్ ఇంటి సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి తుపాకితో తిరుగుతున్నట్టు గుర్తించారు.

నిందితుడిని రాజస్థాన్‌కు చెందిన బాబుసింగ్‌గా అనుమానిస్తున్నారు. ఈ ఘటన వెనకున్న కారణాలు స్పష్టంగా తెలియనప్పటికీ ఆర్థిక లావాదేవీలే కారణమై ఉండొచ్చని అనుమానిస్తున్నారు. తలీల్ చంద్ కుమారుడు శీర్షిత్.. భార్య నుంచి విడిపోయాడు. ప్రస్తుతం విడాకుల కేసు కోర్టులో పెండింగులో ఉన్నట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. కేసు నమోదు చేసుకున్న  పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News