వాటిపై విజయసాయిరెడ్డి కన్నేశారేమో అనే అనుమానం కలుగుతోంది?: రఘురామకృష్ణరాజు
- సంబంధం లేని విశాఖతో విజయసాయికి ఏం పని?
- సంచయిత నియామకం వెనుక అంతరార్థం ఏమిటి?
- అమరావతి రైతులను వెంటనే విడుదల చేయాలి
మాన్సాస్, సింహాచలం ట్రస్టుకు వేలాది ఎకరాల భూములు ఉన్నాయని... రాజధాని విశాఖకు మారితే వాటి రేట్లు భారీగా పెరుగుతాయని... ఆ ఉద్దేశంతోనే వాటిపై విజయసాయి కన్నేశారేమో అనే అనుమానం కలుగుతోందని రఘురాజు అన్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ కూడా మాన్సాస్ కాలేజీలో చదువుకున్నానని చెప్పారని... ఇప్పుడు అదే కాలేజీ కళ్ల ముందే నాశనమవుతుంటే ఆయన ఎందుకు నోరు మెదపడం లేదని మండిపడ్డారు. సంచయిత రికార్డుల్లో తండ్రి పేరు రమేశ్ శర్మగా ఉందని... అందువల్ల ఆనందగజపతిరాజు ఆస్తులపై ఆమెకు ఎలాంటి హక్కు లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆనందగజపతిరాజు చనిపోయినప్పుడు చూడ్డానికి కూడా సంచయిత రాలేదని చెప్పారు.
రాజధాని కోసం గాంధీ మార్గంలో ఉద్యమం చేస్తున్న అమరావతి రైతులపై కరోనా కేసులు పెడుతున్నారని రఘురాజు మండిపడ్డారు. అయితే, రైతుల ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేసేందుకు గుంపులుగా వచ్చిన పెయిడ్ ఆర్టిస్టులపై కరోనా కేసులు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు బేడీలు వేసి, జైల్లో పెట్టడం దారుణమని అన్నారు. వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.