ట్రంప్‌కు కరోనా చికిత్స పూర్తయింది: వైట్ హౌస్ వైద్యుడి ప్రకటన

  • ప్రజల ముందుకు వచ్చినా పర్వాలేదు 
  • శుక్రవారం నుంచే ఆయనలో ఎటువంటి లక్షణాలు లేవు
  • ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది
అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ కి కరోనా సోకడంతో ఆయన ప్రచార కార్యక్రమాలు వాయిదా వేసుకున్న విషయం తెలిసిందే. అయితే, ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం అక్టోబరు 15న ట్రంప్‌, బైడెన్‌ మధ్య రెండో డిబేట్‌ జరగాల్సి ఉండగా, అందులో పాల్గొంటానని ఇప్పటికే ప్రకటించారు. ప్రస్తుతం శ్వేతసౌధంలో ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు.

ఈ నేపథ్యంలో వైట్ హౌస్ డాక్టర్‌ సియాన్‌ కాన్లే కీలక ప్రకటన చేశారు.  ట్రంప్‌కు అందించాల్సిన చికిత్స పూర్తయినట్లు తెలిపారు. ఆయన ప్రజల ముందుకు వచ్చినా పర్వాలేదని కూడా వైద్యులు చెప్పారు. గత శుక్రవారం నుంచే ఆయనలో ఎటువంటి లక్షణాలు లేవని తెలిపారు. వైట్ హౌస్ చేరుకున్న నాటి నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు.

చికిత్సకు ట్రంప్ బాగా స్పందించారని, ఇచ్చిన ఔషధాల వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు కూడా కనిపించలేదని వివరించారు. ట్రంప్ కు కొవిడ్ సోకినట్లు నిర్ధారణ అయ్యి రేపటితో పది రోజులు పూర్తవుతుందని చెప్పారు. వైద్య బృందం అధునాతన పరీక్షలు నిర్వహిస్తోందని తెలిపారు. ట్రంప్ కూడా తన ఆరోగ్యం బాగుందని ప్రకటించుకుంటున్నారు.


More Telugu News

Donald Trump USA Corona Virus