Adimulapu Suresh: నాకు ఇంత మంచి బాధ్యతను అప్పగించిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు: ఆదిమూలపు సురేశ్

అమ్మఒడి పథకం ద్వారా ముఖ్యమంత్రి జగన్ ప్రతి ఇంటికి పెద్దన్నలా నిలిచారని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ అన్నారు. కాసేపటి క్రితం ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది.

ఈ సందర్భంగా సురేశ్ మాట్లాడుతూ విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించేందుకే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు తెలిపారు. గత ప్రభుత్వం పాఠశాలలను పట్టించుకోలేదని... వైసీపీ అధికారంలోకి వచ్చాక పాఠశాలల రూపురేఖలే మారిపోయాయని చెప్పారు. చదువుకు పేదరికం అడ్డుకాకూడదనే ఉద్దేశంతోనే జగన్ ఈ కార్యక్రమాన్ని చేపట్టారని అన్నారు.

విద్యాకానుక పథకం ద్వారా రాష్ట్రంలోని పిల్లలందరికీ జగన్ మేనమామగా మారారని చెప్పారు. పేద పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడం, వారి భవిష్యత్తుకు బంగారు బాట వేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. విద్యాకానుక పథకం ద్వారా రూ. 650 కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. ప్రతి విద్యార్థికి రూ. 1600 విలువైన కిట్ ను అందిస్తున్నామని తెలిపారు. తనకు ఇంత మంచి బాధ్యతను అప్పగించిన ముఖ్యమంత్రి జగన్ కు మంత్రి ధన్యవాదాలు తెలిపారు.
Adimulapu Suresh
Jagan
YSRCP

More Telugu News