హీరో సుశాంత్‌ ఉరి వేసుకోవడం వల్లే చనిపోయాడు: ఎయిమ్స్‌ తుది నివేదిక

  • మృతదేహంలో ఎలాంటి విషం ఆనవాళ్లు లేవు  
  • ఆయన డీఎన్‌ఏను పూర్తిగా పరిశీలించాం
  • ఎటువంటి సందేహాలు అవసరం లేదు
  • మానసిక ఒత్తిడి కారణంగానే ఆత్మహత్య?
బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ మృతి కేసులో ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన మృతికి గల కారణాలను సుదీర్ఘంగా పరిశీలించిన ఎయిమ్స్‌ వైద్యులు ఈ రోజు తమ తుది నివేదికను సర్కారుకు సమర్పించారు. ఆయన మృతదేహంలో ఎలాంటి విషం ఆనవాళ్లు లేవని అందులో స్పష్టం చేశారు. సుశాంత్‌ ఉరి వేసుకోవడం వల్లే చనిపోయాడని తెలిపారు.

ఆయన డీఎన్‌ఏను పూర్తిగా పరిశీలించామని, ఆ తర్వాతే నివేదికను సమర్పిస్తున్నామని పేర్కొన్నారు. ఈ విషయంలో ఎటువంటి సందేహాలు అవసరం లేదని తెలిపారు. సుశాంత్‌ మృతికి సంబంధించి గతంలో మహారాష్ట్ర వైద్యులు నివేదిక ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ నివేదికలో తేలిన అంశాలే తమ పరిశీలనలోనూ నిర్ధారణ అయ్యాయని ఎయిమ్స్‌ వైద్యులు చెప్పారు.

ఆయన మానసిక ఒత్తిడి కారణంగానే ఆత్మహత్య చేసుకున్నాడని వైద్యులు భావిస్తున్నారు.  కాగా, సుశాంత్‌ సింగ్‌ జూన్‌ 14న ముంబైలోని తన నివాసంలో మృతి చెందాడు. దీనిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆయన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చివరకు ఈ కేసును సీబీఐకి అప్పగించారు. ఈ కేసు విచారణలో భాగంగా డ్రగ్స్‌ వ్యవహారం కూడా బయట పడింది.


More Telugu News

aiims Sushant Singh Rajput CBI