విజయసాయి రెడ్డిపై అనర్హత వేటు వర్తించదని రాష్ట్రపతి ఉత్తర్వులు!

రెండు పదవులను అనుభవిస్తున్న కారణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత విజయసాయి రెడ్డిపై అనర్హత వేటు వేయాలంటూ, సీహెచ్ రామకోటయ్య చేసిన ఫిర్యాదు చెల్లబోదంటూ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీ చేశారు. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న విజయసాయి, ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగానూ జోడు పదవులను అనుభవిస్తున్నారని ఆరోపించిన రామకోటయ్య, తన ఫిర్యాదును రాష్ట్రపతికి పంపుతూ విజయసాయిని అనర్హుడిగా ప్రకటించాలని కోరారు.

ఇదే ఫిర్యాదును కేంద్ర ఎన్నికల సంఘానికి పంపిన రాష్ట్రపతి, సలహా కోరగా, పార్లమెంట్ అనర్హత నిరోధక చట్టం 1959 ప్రకారం, ప్రత్యేక ప్రతినిధిగా ఎటువంటి వేతనం, భత్యం తీసుకోని విజయసాయిపై, ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కింద చర్యలు తీసుకునే అవకాశాలు లేవని స్పష్టం చేసింది. దీంతో ఆయనపై అనర్హత వేటు చెల్లబోదని రాష్ట్రపతి పేరిట ఉత్తర్వులు జారీ అయ్యాయి.


More Telugu News