బాబాయ్ కి బెయిల్ వచ్చినా కరోనా చికిత్స జరుగుతోంది... ఎవరూ పరామర్శలకు రావొద్దు: రామ్మోహన్ నాయుడు

  • అచ్చెన్నాయుడుకు బెయిల్ మంజూరు
  • అభిమానుల ప్రార్థనలు ఫలించాయన్న రామ్మోహన్
  • అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్
ఈఎస్ఐ కొనుగోళ్ల వ్యవహారంలో టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుకు హైకోర్టు బెయిల్ మంజూరు చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో యువ ఎంపీ రామ్మోహన్ నాయుడు ట్విట్టర్ లో స్పందించారు. మా బాబాయ్ అచ్చెన్నాయుడుకు బెయిల్ మంజూరు అయిందంటూ సంతోషంగా వెల్లడించారు. టీడీపీ, కింజరాపు కుటుంబ అభిమానుల ప్రార్థనలు ఫలించాయని తెలిపారు. స్వచ్ఛమైన రాజకీయ జీవితంలో మచ్చలేని అచ్చెన్నాయుడు రాజకీయ వేధింపులతో పెట్టిన కేసుల నుంచి మీ అందరి ఆశీస్సులతో బయటికి వస్తారని పేర్కొన్నారు.

అయితే, బాబాయ్ కి బెయిల్ వచ్చినా, ఆయనకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయినందున వైద్యులు చికిత్స అందిస్తున్నారని, దయచేసి ఎవరూ పరామర్శించేందుకు రావొద్దని ఎంపీ అందరికీ విజ్ఞప్తి చేశారు. "మీ అభిమానమే మాకు కొండంత అండ. బాబాయ్ కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ కింజరాపు కుటుంబం తరఫున పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ కష్టకాలంలో మా కుటుంబానికి అండగా నిలిచిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు, టీడీపీ నేతలకు, కార్యకర్తలకు శిరసు వంచి నమస్కరిస్తున్నాను" అంటూ రామ్మోహన్ నాయుడు ట్వీట్ చేశారు.

Kinjarapu Ram Mohan Naidu
Atchannaidu
Bail
Corona Virus
Telugudesam
Chandrababu
Andhra Pradesh

More Telugu News