అక్కడ రాహుల్ నమ్మకం కోల్పోయాడు, ఇక్కడ లోకేశ్ పరిస్థితి కూడా అంతే: జీవీఎల్
- ఏపీలో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయిందన్న జీవీఎల్
- తెలంగాణలోనూ కనుమరుగవుతుందని వెల్లడి
- కాంగ్రెస్, టీడీపీవి కుటుంబ రాజకీయాలంటూ వ్యాఖ్యలు
కాంగ్రెస్ పార్టీ ఏపీలో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందని పేర్కొన్నారు. జాతీయస్థాయిలో ఆ పార్టీ ఏవిధంగా పతనం చెందుతోందో, అంతకు రెట్టింపు వేగంతో తెలంగాణలో కనుమరుగయ్యే ప్రమాదంలో పడిందని అభిప్రాయపడ్డారు. కాబట్టి తెలంగాణలో కచ్చితంగా బీజేపీనే ప్రత్యామ్నాయంగా ఎదగబోతోందని వెల్లడించారు. ఇక కాంగ్రెస్ పార్టీకి ఉన్న దుర్లలక్షణాలు ఏవైతే ఉన్నాయో, అవన్నీ పుణికి పుచ్చుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ అని విమర్శించారు. ఏపీలో అధికారంలో లేని పార్టీ అని, కుటుంబ రాజకీయాలతో ప్రజల్లో చెడ్డపేరు తెచ్చుకున్న పార్టీ అని వ్యాఖ్యానించారు.
వంశపారంపర్య రాజకీయాలతో కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీపై ఏవిధంగా అయితే నమ్మకం లేదో, టీడీపీలోనూ రెండో తరం నాయకత్వంపై, ముఖ్యంగా లోకేశ్ నాయకత్వంపై నమ్మకం లేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ తల్లీతనయుల పార్టీ అయితే, టీడీపీ తండ్రీతనయుల పార్టీ అని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం రెండూ ఒకే పరిస్థితుల్లో ఉన్నాయని, దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తన భవిష్యత్ కు తానే ప్రశ్నార్థకంగా మిగిలితే, ఏపీలో టీడీపీ పరిస్థితి కూడా అంతేనని అన్నారు.
కాంగ్రెస్ జాతీయ పార్టీ అయినందున కనీసం కొన్ని రాష్ట్రాల్లో అయినా అధికారంలో నిలబెట్టుకుందని, కానీ టీడీపీకి ఆ అవకాశం కూడా లేదని వివరించారు. ఈ క్రమంలో బీజేపీ తనదైన భావజాలంతో, సైద్ధాంతిక బలంతో రెండు రాష్ట్రాల్లోనూ అధికారంలోకి వస్తుందన్న నమ్మకం తమకుందని జీవీఎల్ ధీమా వ్యక్తం చేశారు.