హైదరాబాద్ లో పలు ప్రాంతాలు వరద నీటిలో... మోహరించిన హెలికాప్టర్లు!
- తెలంగాణలో నాలుగు రోజులుగా భారీ వర్షాలు
- పొంగి పొరలుతున్న వాగులు, వంకలు
- పలు జలాశయాల్లో పూర్తి స్థాయిలో నీరు
- కట్టల నుంచి లీక్ అవుతున్న నీరు
- ప్రాణనష్టం జరుగకుండా చూడాలని కేసీఆర్ ఆదేశం
ఆదివారం నాడు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్, వరద పరిస్థితిపై అడిగి తెలుసుకున్నారు. ముంపు ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఎటువంటి పరిస్థితులు ఎదురైనా, సత్వరమే స్పందించి, ప్రాణనష్టం జరుగకుండా చూడాలని కేసీఆర్ ఆదేశించారు. ఇందుకోసం నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఇప్పటికే సిద్ధంగా ఉందని అధికారులు తెలిపారు.
కాగా, నిన్న జయశంకర్ భూపాలపల్లిలో వరదలో చిక్కుకుపోయిన 12 మంది రైతులను కుందనపల్లి సమీపంలో హెలికాప్టర్ సాయంతో రక్షించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లో రెండు కంట్రోల్ రూములను ఏర్పాటు చేశామని, రెస్క్యూ ఆపరేషన్స్ కోసం రెండు హెలికాప్టర్లు సిద్ధం చేశామని, అన్ని ప్రభుత్వ విభాగాల్లోనూ హై అలర్ట్ అమలవుతోందని అధికారులు తెలిపారు.
వరంగల్, కరీంనగర్ ప్రాంతాల్లో జలాశయాలు పూర్తిగా నిండిపోయి, వరద ప్రవాహం అధికంగా ఉండటంతో కట్టలు తెగే ప్రమాదాన్ని ఊహించిన కేసీఆర్, అధికారులు అప్రమత్తంగా ఉండి, చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కొన్ని జలాశయాల్లో నీరు లీక్ అవుతోందన్న విషయం తన దృష్టికి వచ్చిందని ఆయన తెలిపారు. కట్టల వద్ద నిరంతర నిఘా పెట్టాలని, వర్షాలు తగ్గే వరకూ అప్రమత్తంగా ఉండాలని కేసీఆర్ పేర్కొన్నారు.