ఆత్మస్థైర్యం నిండుగా ఉన్న బాలు తప్పకుండా కోలుకుంటారు: పవన్ కల్యాణ్

  • కరోనా చికిత్స పొందుతున్న ఎస్పీ బాలు
  • ఐసీయూలో చికిత్స
  • తమ కుటుంబానికి బాలు సన్నిహితుడని పవన్ వెల్లడి
ప్రముఖ సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చెన్నై ఎంజీఎం ఆసుపత్రిలో కరోనా చికిత్స పొందుతున్నారు. గురువారం రాత్రి ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ఐసీయూలోకి మార్చి వెంటిలేటర్ వ్యవస్థ అమర్చారు. దీనిపై జనసేనాని పవన్ కల్యాణ్ స్పందించారు. ప్రఖ్యాత గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎంతో ఆత్మస్థైర్యం ఉన్న వ్యక్తి అని, ఆయన వీలైనంత త్వరగా కోలుకుని మన ముందుకు వస్తారన్న విశ్వాసం ఉందని పేర్కొన్నారు.

చెన్నైలోని ఓ ఆసుపత్రిలో బాలు లైఫ్ సపోర్ట్ తో ఉన్నారని నిన్న తెలియగానే, ఆత్మస్థైర్యం నిండుగా ఉన్న ఆయన తప్పకుండా కోలుకుంటారని భావించానని పవన్ తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని కుటుంబ సభ్యులు చెబుతున్నారని, ఇది ఎంతో ఊరటనిచ్చే వార్త అని పేర్కొన్నారు. తమ కుటుంబానికి బాలు ఎంతో సన్నిహితుడని, ఆయన ఈ పరిస్థితి నుంచి బయటపడాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నానని పవన్ తన ప్రకటనలో వివరించారు.

Pawan Kalyan
SP Balasubrahmanyam
Corona Virus
ICU
Chennai

More Telugu News