కరోనాతో కన్నుమూసిన సీపీఎం సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య

తెలంగాణలో పలువురు ప్రజా ప్రతినిధులు కరోనా బారినపడి చికిత్స పొందుతుండగా, తాజాగా భద్రాచలం మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య (62) కరోనాతో కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో అనుమానించిన కుటుంబ సభ్యులు నిన్న కరోనా పరీక్షలు చేయించగా పాజిటివ్ అని తేలింది. దీంతో వెంటనే ఆయనను భద్రాచలం నుంచి విజయవాడ ఆసుపత్రికి తరలిస్తుండగా దారిలోనే కన్నుమూశారు. సీపీఎం సీనియర్ నేత అయిన రాజయ్య మూడుసార్లు భద్రాచలం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

రాజయ్య తన జీవితాన్ని చాలా నిరాడంబరంగా గడిపారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసినా అసెంబ్లీ సమావేశాలకు మాత్రం బస్సులోనో, ఆటోలోనో వెళ్లేవారు. ప్రజా పోరాటాల్లో ముందుండేవారు. గత 10 రోజులుగా జ్వరంతో బాధపడుతుండగా స్వగ్రామమైన సున్నంవారిగూడెంలో చికిత్స తీసుకున్నారు. అయినప్పటికీ ఆరోగ్యం కుదుటపడకపోవడంతో నిన్న కరోనా పరీక్షలు చేయించుకోగా వైరస్ సంక్రమించినట్టు తేలింది.

భద్రాచలం నియోజ‌క‌వ‌ర్గం నుంచి 1999, 2004, 2014లో ఎమ్మెల్యేగా విజయం సాధించిన రాజయ్య.. గత అసెంబ్లీ ఎన్నికల్లో రంపచోడవరం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. మరికాసేపట్లో స్వగ్రామం సున్నంవారిగూడెంలో రాజయ్య అంత్యక్రియలు జరగనున్నాయి.

Bhadradri Kothagudem District
sunnam Rajaiah
Corona Virus
Dead
Vijayawada

More Telugu News