Rajnath Singh: చైనాతో చర్చలు ఎంతమేర పరిష్కారం చూపుతాయన్నది చెప్పలేం: రాజ్ నాథ్

Rajnath Visits Ladakh and interacts with armed forces
  • లడఖ్ లో రాజ్ నాథ్ పర్యటన
  • భారత్ సరిహద్దులు శత్రు దుర్భేద్యమని ఉద్ఘాటన
  • దేశ గౌరవం అన్నిటికంటే గొప్పదని వెల్లడి
ఇటీవల భారత్-చైనా బలగాల మధ్య ఘర్షణలకు కేంద్రంగా నిలిచిన లడఖ్ ప్రాంతంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పర్యటించారు. అక్కడ విధుల్లో ఉన్న భద్రతా బలగాలతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఇటీవల చైనాతో ఏర్పడిన సరిహద్దు వివాదంపై చర్చలు జరుగుతున్నాయని, ఈ చర్చలు ఎంతవరకు పరిష్కారం చూపిస్తాయన్నది ఇప్పటికిప్పుడు చెప్పలేమని అన్నారు.

అయితే దేశ గౌరవాన్ని మించింది లేదని, దేశ గౌరవానికి భంగం కలిగించే ఏ ప్రయత్నాన్నయినా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. భారత్ లోని అంగుళం భూభాగాన్ని కూడా ఎవరూ ఆక్రమించలేరని, ఎవరైనా దురాక్రమణకు దిగితే సరైన జవాబు చెబుతామని హెచ్చరించారు. భారత్ సరిహద్దులు శత్రు దుర్భేద్యం అని తెలిపారు. భారత్ ఎప్పుడూ శాంతినే కోరుకుంటుందని, తనంత తానుగా ఏ దేశంపైనా భారత్ దాడి చేసినట్టు చరిత్రలో లేదని స్పష్టం చేశారు.
Rajnath Singh
Ladakh
Army
India
China

More Telugu News