Vijayasai Reddy: మాజీ మంత్రులు తప్పించుకోలేరన్న విజయసాయి... కారు దింపిన తర్వాత ఫ్రస్ట్రేషన్ లో పడ్డావంటూ ఉమ కౌంటర్!

Verbal exchange between Vijayasai Reddy and Devineni Uma
షార్ట్స్‌లో చూడండి
గత కొన్నిరోజులుగా వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకున్నారు. వరుస అరెస్టులపై టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై విజయసాయి స్పందిస్తూ ట్విట్టర్ లో ధ్వజమెత్తారు.

"వాస్తవాలు చెబుతుంటే ప్రభుత్వం కక్షపూరితంగా అరెస్టులు చేస్తోందంటున్నారు. ఉమకి ఫ్రస్ట్రేషన్ లో ఏం మాట్లాడేది తెలియడంలేదు. నీటిపారుదల ప్రాజెక్టుల కుంభకోణాలు బయటికి వస్తే నువ్వూ ఊచలు లెక్కపెట్టాల్సిందే ఉమా! మాజీ సీఎం అయినా, మాజీ మంత్రులైనా ఎవరూ తప్పించుకోలేరు. దోచుకోవడాలు, పంచుకోవడాలు మీతోనే పోయాయి" అంటూ వ్యాఖ్యానించారు.

దీనిపై దేవినేని ఉమ కొద్ది వ్యవధిలోనే ప్రతిస్పందించారు. తమ హయాంలో ఏపీ నీటిపారుదల రంగాన్ని దేశంలోనే 2వ స్థానంలో నిలిపామని ఉద్ఘాటించారు. "కారు దింపిన తర్వాత ఫ్రస్ట్రేషన్ లో పడినట్టున్నావు. 108 అంబులెన్సుల్లో రూ.307 కోట్లు కొట్టేశావు. 12 సీబీఐ, ఈడీ కేసుల్లో 16 నెలల ఊచలు లెక్కపెట్టావు. మీ తప్పుడు కేసులకు భయపడం. జైలు నుంచి బెయిల్ పై వచ్చావ్.. ఒళ్లు జాగ్రత్త... బెదిరింపులు ఆపితే మంచిది" అంటూ ఉమ హెచ్చరించారు.
Go Back to Shorts
Vijayasai Reddy
Devineni Uma
Telugudesam
YSRCP
Andhra Pradesh

More Telugu News