Roja: లోకేశ్ పై రోజా తీవ్ర విమర్శలు!

Roja Fires on Chandrababu and Lokesh
షార్ట్స్‌లో చూడండి
ప్రజలంతా కరోనా వైరస్ భయాందోళనలో ఉన్న వేళ, దగ్గరుండి భరోసాను ఇవ్వాల్సిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తన కుమారుడు లోకేశ్ తో కలిసి పక్క రాష్ట్రానికి పారిపోయి, దాక్కున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ ఉదయం తిరుమలకు వచ్చిన ఆమె, స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడిన ఆమె, ఎమ్మెల్యేగా కూడా గెలవలేని లోకేశ్ ఓ దద్దమ్మని అభివర్ణించారు. పనీపాటా లేని లోకేశ్, తిన్నది అరగక అవాకులు, చవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. అవినీతికి పాల్పడినవారిపై చర్యలు తీసుకుంటుంటే, వారిని పరామర్శించేందుకు చంద్రబాబు, లోకేశ్ పరిగెత్తుకుంటూ ఏపీకి వచ్చారని ఆరోపించారు.

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఏడాది వ్యవధిలోనే ఇచ్చిన హామీలను జగన్ అమలు చేశారని, కరోనా విషయంలోనూ ఎంతో ముందుచూపుతో వ్యవహరించారని, ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తూ, వైద్యాన్ని కూడా ఉచితంగా అందిస్తున్నామని అన్నారు. కరోనా కట్టడి విషయంలో మిగతా రాష్ట్రాలకు ఏపీ ఆదర్శంగా నిలిచిందని, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, పలు రకాల సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తున్నదని రోజా వ్యాఖ్యానించారు.
Go Back to Shorts
Roja
Tirumala
Nara Lokesh
Chandrababu

More Telugu News