టీ20 ప్రపంచకప్ నిర్వహణ కష్టమన్న ఆస్ట్రేలియా.. ఐపీఎల్‌పై పెరిగిన ఆశలు

  • పూర్తిస్థాయిలో అయినా, కుదించి అయినా నిర్వహించాలంటున్న ఫ్రాంచైజీలు
  • భారత్‌లో కాకుంటే శ్రీలంక, న్యూజిలాండ్ అయినా ఓకే
  • బీసీసీఐ నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్న నెస్ వాడియా
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)పై అభిమానుల్లో ఆశలు పెరుగుతున్నాయి. టీ20 ప్రపంచకప్ నిర్వహణ ఇప్పట్లో సాధ్యమయ్యేలా కనిపించడం లేదంటూ ఆతిథ్య దేశం ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు (సీఏ) ప్రకటించింది. దీంతో అదే సమయంలో ఐపీఎల్‌ నిర్వహించడంపై బీసీసీఐ ఆలోచిస్తోంది. టీ20పై ఏదో ఒకటి తేలిన తర్వాత ఐపీఎల్ నిర్వహణపై ఆలోచిస్తామని బీసీసీఐ ఇది వరకే పేర్కొన్న నేపథ్యంలో ఫ్రాంచైజీలు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నాయి.

అయితే పూర్తిస్థాయిలో, లేదంటే కుదించి అయినా నిర్వహించాలని కోరుతున్నాయి. అంతేకాదు, భారత్‌లో కనుక కుదరకుంటే విదేశాల్లో అయినా నిర్వహించాలని పేర్కొన్నాయి. లీగ్ పరిధి విషయంలో బీసీసీఐ నిర్ణయానికి తాము కట్టుబడి ఉంటామని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు సహ యజమాని నెస్ వాడియా పేర్కొన్నారు. అయితే, తనకు తెలిసినంత వరకు పూర్తిస్థాయిలో నిర్వహించడానికే బీసీసీఐ మొగ్గు చూపుతుందని, అయితే, కుదించినా తమకు సమ్మతమేనని అన్నారు. లీగ్ నిర్వహణ భారత్‌లో సాధ్యం కాకుంటే శ్రీలంక, న్యూజిలాండ్‌లోనైనా నిర్వహించవచ్చని వివరించారు.

IPL
T20 World Cup
BCCI
Australia

More Telugu News