చేతబడి ఆరోపణ.. అత్త తల తెగనరికి 13 కిలోమీటర్లు నడిచి పోలీస్ స్టేషన్‌లో లొంగుబాటు!

  • ఒడిశాలోని గిరిజన గ్రామంలో ఘటన
  • చేతబడి వల్ల తన కుమార్తె చనిపోయిందని అనుమానం
  • అందరూ చూస్తుండగానే వృద్ధురాలిని దారుణంగా చంపిన వైనం
ఒడిశాలో దారుణం జరిగింది. చేతబడి ఆరోపణలతో ఓ మహిళ తలను తెగనరికిన వ్యక్తి దానిని చేత్తో పట్టుకుని 13 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. తల, గొడ్డలితో స్టేషన్‌కు వచ్చిన వ్యక్తిని చూసి పోలీసులు హడలిపోయారు.

పోలీసుల కథనం ప్రకారం... ఖుంటూ పోలీస్ స్టేషన్ పరిధిలోని గిరిజన గ్రామమైన నువాసహిలో బుద్దురామ్ సింగ్ (30) కుటుంబంతో కలిసి జీవిస్తున్నాడు. అనారోగ్యానికి గురైన అతడి కుమార్తె మూడు రోజుల క్రితం మృతి చెందింది. తన కుమార్తె మరణానికి వరుసకు అత్త అయిన చంపాన్ సింగ్ (60) కారణమని, ఆమె చేతబడి చేయడం వల్లే తన కుమార్తె మరణించిందని అనుమానించి ఆమెపై కక్ష పెంచుకున్నాడు.

ఈ క్రమంలో నిన్న ఉదయం ఇంటి వరండాలో నిద్రిస్తున్న చంపాన్‌సింగ్‌ను బుద్దురామ్‌సింగ్ బయటకు ఈడ్చుకొచ్చాడు. అనంతరం అందరూ చూస్తుండగానే ఆమెను అత్యంత కిరాతకంగా హతమార్చాడు. ఆ తర్వాత మొండెం నుంచి తలను వేరు చేసి, ఆ తలను తువ్వాలులో చుట్టుకుని, హత్యకు ఉపయోగించిన గొడ్డలి పట్టుకుని పోలీస్ స్టేషన్‌కు బయలుదేరాడు. 13 కిలోమీటర్లు నడుచుకుంటూ పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు.

తల, గొడ్డలితో స్టేషన్‌కు వచ్చిన నిందితుడిని చూసిన పోలీసులు హడలిపోయారు. అనంతరం అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడిచ్చిన సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకుని మహిళ మొండాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Odisha
Blackmagic
murder
Crime News

More Telugu News