Telangana: రాష్ట్ర ఆవిర్భావం రోజున ఇంతకంటే దారుణం ఉంటుందా?: కేసీఆర్ ప్రభుత్వంపై ఉత్తమ్ ఫైర్

  • నేడు రాష్ట్రవ్యాప్తంగా జలదీక్షకు సిద్ధమైన కాంగ్రెస్ నేతలు
  • ఎక్కడికక్కడ గృహ నిర్బంధం చేస్తున్న పోలీసులు
  • తెలంగాణను తెచ్చుకున్నది ఇందుకేనా? అని ప్రశ్న
TPCC Chief Uttam Kumar Reddy fires on KCR Govt

రాష్ట్రవ్యాప్తంగా నేడు జలదీక్షకు సిద్ధమైన కాంగ్రెస్ పార్టీ నేతలను ఎక్కడికక్కడ పోలీసులు గృహ నిర్బంధం చేస్తుండడంపై తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి మండిపడ్డారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున ఇంతకంటే దారుణం మరోటి ఉండదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ నేతల అరెస్టును ఖండిస్తున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో దుర్మార్గపు పాలన కొనసాగుతోందని ధ్వజమెత్తారు. తమ నేతల ఇళ్ల ముందు ఉన్న పోలీసులు తక్షణం వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు.

శాంతియుతంగా తాము చేయాలనుకున్న కార్యక్రమాలను అడ్డుకోవద్దని కోరారు. మాట్లాడితే అరెస్ట్ చేస్తున్నారని, తెలంగాణను తెచ్చుకున్నది ఇందుకేనా? అని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని ఓ నియంత పాలిస్తున్నారని ఉత్తమ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాగా, ఉత్తమ్‌ను కూడా పోలీసులు గృహ నిర్బంధం చేశారు. కాంగ్రెస్‌కే చెందిన మరో సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా నేతల గృహ నిర్బంధాలపై మండిపడ్డారు. కేసీఆర్ నియంత పోకడలకు ఇది నిదర్శనమన్నారు.

More Telugu News