పాకిస్థాన్ లో విమాన ప్రమాదం... 99 మంది దుర్మరణం?

  • కరాచీ విమానాశ్రయం సమీపంలో కుప్పకూలిన విమానం
  • ల్యాండింగ్ కు ప్రయత్నిస్తుండగా ప్రమాదం
  • ప్రమాద వేళ విమానంలో 91 మంది ప్రయాణికులు, 8 మంది సిబ్బంది
పాకిస్థాన్ లో విమాన ప్రమాదం సంభవించింది. పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ (పీఐఏ)కి చెందిన ప్రయాణికుల విమానం కరాచీలోని జిన్నా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు 4 కిలోమీటర్ల దూరంలో కుప్పకూలింది. ఈ ఎయిర్ బస్ ఏ-320 విమానంలో ప్రమాదం జరిగిన సమయంలో 99 మంది ఉన్నట్టు భావిస్తున్నారు. వీరిలో ఎవరూ బతికే అవకాశాలు లేవని తెలుస్తోంది. లాహోర్ నుంచి వచ్చిన ఈ విమానంలో 91 మంది ప్రయాణికులు కాగా, 8 మంది విమాన సిబ్బంది.

ల్యాండింగ్ కు ప్రయత్నిస్తుండగా, విమానం ఒక్కసారిగా అదుపుతప్పి విమానాశ్రయం సమీపంలోని జిన్నా గార్డెన్ ఏరియాలో కూలిపోయింది. ఘటనపై సమాచారం అందుకున్న పాక్ క్విక్ రియాక్షన్ బృందాలు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని సహాయక కార్యక్రమాలకు ఉపక్రమించాయి. కాగా, ఈ ప్రమాదంలో అనేక ఇళ్లు కూడా ధ్వంసమయ్యాయి. విమానం నివాస గృహాలపై కూలిపోవడంతో స్థానికులు కూడా పెద్ద సంఖ్యలో మరణించి ఉంటారని భావిస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం రావాల్సి ఉంది.

Plane Crash
Karachi
Airport
Pakistan
Landing

More Telugu News