ఎమ్మెల్సీ కుమారుడిగా వివాహితతో పరిచయం.. ఫొటోలు బయటపెడతానంటూ రూ. 15 లక్షల డిమాండ్

  • కొండాపూర్ మహిళతో పరిచయం 
  • డబ్బులు ఇవ్వకుంటే ఫొటోలు వైరల్ చేస్తానని బెదిరింపులు
  • నిందితుడి కోసం పోలీసుల గాలింపు
తనను తాను ఎమ్మెల్సీ కుమారుడిగా పరిచయం చేసుకుని ఓ వివాహితతో పరిచయం పెంచుకున్న ఓ వ్యక్తి ఆపై వేధింపులకు పాల్పడ్డాడు. అతడి వేధింపులు భరించలేని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడి బాగోతం బయటకొచ్చింది. ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందీ ఘటన.

పోలీసుల కథనం ప్రకారం. కొండాపూర్ ప్రాంతానికి చెందిన ఓ వివాహిత (30)కి కొంత కాలం క్రితం భరత్‌కుమార్ అలియాస్ చింటూ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. భరత్ కుమార్ తనను తాను ఎమ్మెల్సీ కొడుకుగా పరిచయం చేసుకున్నాడు.

ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం స్నేహంగా మారింది. దీనిని అవకాశంగా తీసుకున్న నిందితుడు తనలోని అసలు రూపాన్ని బయటకు తీశాడు. తనకు వెంటనే రూ. 15 లక్షలు ఇవ్వాలని వేధించడం మొదలుపెట్టాడు. ఇవ్వకుంటే ఇద్దరు కలిసి ఉన్నప్పుడు తీసుకున్న ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేస్తానని బెదిరించాడు. అతడి వేధింపులు రోజురోజుకు ఎక్కువ అవుతుండడంతో విసిగిపోయిన బాధితురాలు తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.

Hyderabad
Kondapur
MLC
Crime News
woman

More Telugu News