దేశంలోని కరోనా మృతుల్లో 103 మంది 30 ఏళ్లలోపు వారే!

  • మృతుల్లో 2,198 పురుషులు
  • 2500 మందిలో మధుమేహం, రక్తపోటు ఇతర సమస్యలు
  • 3 శాతంగా దేశంలో మరణాల రేటు
కరోనా బారినపడి దేశవ్యాప్తంగా మృతి చెందిన వారిలో 103 మంది 30 ఏళ్లలోపు వారేనని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ విడుదల చేసిన గణాంకాలు చెబుతున్నాయి. వీరిలో 15 ఏళ్లు లోపు వారు 17 మంది ఉన్నారని ప్రభుత్వం పేర్కొంది. కరోనా బారినపడిన వీరు గుండె, కాలేయం, కిడ్నీ సంబంధిత సమస్యలతో మరణించినట్టు తెలిపింది. ఇక, నిన్న ఉదయం వరకు దేశంలో 3,435 మరణాలు సంభవించగా, వీరిలో 60 పైబడిన వారు 50.5 శాతం మంది ఉన్నారని గణాంకాల ద్వారా తెలుస్తోంది.

ఈ మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోయిన వారిలో 1,734 మంది 60 ఏళ్లు పైబడినవారు కాగా, 45-60 ఏళ్ల మధ్య వయసున్న వారు 1,205 మంది, 30-45 ఏళ్ల లోపువారు 392 మంది, 15-30 ఏళ్ల లోపు ఉన్నవారు 85 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం మృతుల్లో 2,500 మందికి పైగా అప్పటికే మధుమేహం, రక్తపోటు, శ్వాసకోశ, కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు.

చనిపోయిన వారిలో 2,198 పురుషులే కావడం గమనార్హం. ఇక, కరోనా మరణాల రేటు ప్రపంచదేశాలతో పోలిస్తే భారత్‌లో చాలా తక్కువగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా సగటున 6.65 శాతంగా ఉన్న మరణాల రేటు భారత్‌లో మాత్రం 3 శాతానికి కొద్దిగా పైన ఉందని ప్రభుత్వం తెలిపింది.

Corona Virus
Youngers
corona deaths
India

More Telugu News