హైదరాబాదులో ఒకే అపార్ట్ మెంట్ లో 25 మందికి కరోనా

  • మాదన్నపేటలో కరోనా కలకలం
  • బర్త్ డే పార్టీకి హాజరైన అపార్ట్ మెంట్ వాసులు
  • కరోనా సోకినట్టు నిర్ధారణ
  • అపార్ట్ మెంట్ ను కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించిన అధికారులు
తెలంగాణలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. తాజాగా హైదరాబాదులోని ఓ అపార్ట్ మెంట్ లో 25 మందికి కరోనా పాజిటివ్ గా తేలడం జీహెచ్ఎంసీ అధికార వర్గాలను ఆందోళనకు గురిచేస్తోంది. ఒకే ప్రదేశంలో ఇన్ని కేసులు రావడంతో ఆ అపార్ట్ మెంట్ ను ఏకంగా కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించారు.

మాదన్నపేటలో ఉన్న ఆ అపార్ట్ మెంట్ చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేసి రాకపోకలపై ఆంక్షలు విధించారు. ఇటీవల అపార్ట్ మెంట్ లో ఓ వ్యక్తి బర్త్ డే వేడుకలు నిర్వహించగా, ఆ పార్టీకి 25 మంది హాజరైనట్టు గుర్తించారు. వారికి కరోనా నిర్ధారణ కావడంతో  అందరినీ గాంధీ ఆసుపత్రికి తరలించారు. వారు ఇప్పటివరకు ఎవరెవరిని కలిశారన్నదానిపై అధికారులు ఆరా తీయడం మొదలుపెట్టారు. కాగా, శనివారం నాడు తెలంగాణలో 55 కొత్త కేసులు నమోదు కాగా, జీహెచ్ఎంసీ పరిధిలోనే 44 కేసులు వెలుగు చూశాయి.

Hyderabad
Apartment
Corona Virus
Positive
GHMC
Telangana

More Telugu News