Madras High court: మద్యం దుకాణాలు మూసేయండి: తమిళనాడు ప్రభుత్వానికి మద్రాస్ హైకోర్టు షాక్

Tamil Nadu Can Sell Liquor Online says High Court
  • దుకాణాల వద్ద భౌతిక దూరం నిబంధనలు గాలికి వదిలేయడంపై ఆగ్రహం
  • లాక్‌డౌన్ అమల్లో ఉన్నంత వరకు మూసివేయాలని ఆదేశం
  • ఆన్‌లైన్‌లో విక్రయించుకోవచ్చన్న కోర్టు
మద్యం దుకాణాల వద్ద వినియోగదారులు భౌతిక దూరం పాటించకపోవడం, పెద్ద ఎత్తున బారులు తీరడంపై మద్రాస్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. లాక్‌డౌన్ ఎత్తివేసేంత వరకు మద్యం దుకాణాలను మూసివేయాలని పళనిస్వామి ప్రభుత్వాన్ని ఆదేశించింది. హోం డెలివరీ మాత్రం చేసుకోవచ్చని పేర్కొంటూ జస్టిస్ వినీత్ కొఠారి, జస్టిస్ పుష్పా సత్యనారాయణలతో కూడిన ప్రత్యేక డివిజన్ బెంచ్ తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ నెల 7 నుంచి మద్యం దుకాణాలను తెరవబోతున్నట్టు ఈ నెల 4న తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ పలువురు లాయర్లు, సామాజిక కార్యకర్తలు మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారించిన కోర్టు మద్యం అమ్మకాలపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. లాక్‌డౌన్ నిబంధనలను కచ్చితంగా పాటించాల్సిందేనని ఆదేశించింది.

అయితే, మద్యం దుకాణాలు తెరవగానే జనం పెద్ద ఎత్తున బారులు తీరడం, భౌతిక దూరాన్ని గాలికి వదిలేయడంపై స్పందించిన కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తెరిచిన దుకాణాలను వెంటనే మూసివేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది.
Madras High court
Tamil Nadu
Liquor shops

More Telugu News