బెంగాల్ లో మరో ఉపద్రవం.. వేల సంఖ్యలో ఇన్ ఫ్లుయెంజా బాధితులు!
- రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటి సర్వే
- 92 వేలమందిలో ఫ్లూ తరహా లక్షణాలు
- 870 మందిలో తీవ్ర శ్వాసకోశ సమస్యలు
ఏప్రిల్ 7 నుంచి మే 3వ తేదీ వరకు నిర్వహించిన ఇంటింటి సర్వేలో ఆరోగ్య కార్యకర్తలు విస్తృత సమాచారం సేకరించారు. సుమారు 5.57 కోట్ల గృహాలకు వెళ్లి వివరాలు రాబట్టారు. ఈ సమాచారాన్ని విశ్లేషించగా, 92,000 మందిలో ఫ్లూ తరహా లక్షణాలు కనిపించాయని అధికారులు వెల్లడించారు.
తమ ప్రభుత్వం ఇంతటి విస్తారమైన స్థాయిలో ఇంటింటి సర్వే నిర్వహించడం వల్ల ఈ వివరాలు తెలిశాయని, వైరస్ మహమ్మారిని తరిమేసేంత వరకు ఈ కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతుందని తెలిపారు. ఫ్లూ బాధితుల్లో 375 మంది వివిధ ఆసుపత్రుల్లో చేరగా, వారిలో 62 మందికి కరోనా పాజిటివ్ అని తేలిందని, వారికి చికిత్స అందిస్తున్నామని మమతా బెనర్జీ వెల్లడించారు. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ లో 1,456 కరోనా పాజిటివ్ కేసులు ఉండగా, 72 మంది మరణించారు.