ఏపీ ప్రజలపై రూ.5 వేల కోట్ల భారం మోపారు: మద్యం ధరల పెంపుపై యనమల

  • మద్యం ధరల పెంపు సరికాదు
  • మద్యం తయారీ కంపెనీల ఒత్తిడి వల్లే ధరలు పెంచారు
  • రాష్ట్రంలో ఇప్పటికే నాటు సారా ఏరులై పారుతోంది
  • నాసిరకం మద్యం అమ్మకాలు పెరిగాయి
ఆంధ్రప్రదేశ్‌లో మద్యం ధరల పెంపు నిర్ణయంపై టీడీపీ నేత యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ మద్యం ధరల పెంపు సరికాదని చెప్పారు. ప్రజలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాదాపు రూ.5 వేల కోట్ల భారం మోపారని, ఈ తీరును టీడీపీ ఖండిస్తోందని చెప్పారు. మద్యం తయారీ కంపెనీల ఒత్తిడి వల్లే ఆంధ్రప్రదేశ్‌లో ధరలు పెంచారని ఆయన ఆరోపించారు.

లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే నాటు సారా ఏరులై పారుతోందని యనమల రామకృష్ణుడు అన్నారు. రాష్ట్రంలో నాసిరకం మద్యం అమ్మకాలు బాగా పెరిగాయని, ప్రజల ఆరోగ్యంతో ఆటలు ఆడుతున్నారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌లో మద్యం ధరల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

 కాగా, రాష్ట్రంలో మద్యం ధరలు పెంచుతూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. వీటిని దాదాపు 25 శాతం మేర పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు మద్యం అమ్మకాలు కొనసాగుతాయి.

Yanamala
Telugudesam
Andhra Pradesh

More Telugu News