ఆడపులి ‘కల్పన’ కరోనాతో మరణించలేదు.. పరీక్షల్లో వెల్లడి!

ఢిల్లీ జూలో మరణించిన 14 ఏళ్ల ఆడపులి ‘కల్పన’కు కరోనా సోకలేదని పరీక్షల్లో తేలింది. కిడ్నీలు పాడై తీవ్ర అనారోగ్యం పాలైన కల్పన గత బుధవారం మృతి చెందింది. గురువారం దీనిని ఖననం చేశారు. అంతకుముందు పులి నుంచి సేకరించిన శాంపిళ్లను కరోనా పరీక్షలకు పంపారు. పులి బాగా బలహీనమైపోయిందని, దానిలో క్రియేటిన్ స్థాయులు భారీగా పెరిగిపోయాయని పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది.  

అధికారుల పర్యవేక్షణ లోపం ఫలితంగానే పులి మరణించిందని సెంట్రల్ జూ అథారిటీ మాజీ కార్యదర్శి డీఎన్ సింగ్ ఆరోపించారు. అది డీహైడ్రేషన్ కారణంగా ప్రాణాలు కోల్పోయిందని అన్నారు. కాగా, పులి నుంచి సేకరించి పంపిన నమూనాలను పరీక్షించిన బరేలీలోని ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ పులికి కరోనా సోకలేదని నిర్ధారించింది. పులులు, పిల్లులకు కూడా కరోనా సోకుతున్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో కల్పన కరోనాతో మరణించలేదన్న వార్తతో జూ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

New Delhi
Zoo
tigress
Corona Virus

More Telugu News