మూడు నెలల ఇంటి అద్దెలు అడగవద్దు: ఇంటి ఓనర్లకు సీఎం కేసీఆర్ ఆదేశం
- మార్చి, ఏప్రిల్, మే నెలల అద్దెలు అడగొద్దని స్పష్టీకరణ
- విద్యాసంస్థలు ఫీజులు పెంచరాదని ఆదేశం
- పెన్షనర్లకు 75 శాతం వేతనాలు
ఇక ఉద్యోగుల, పెన్షనర్ల వేతనాలపైనా స్పష్టత ఇచ్చారు. ఈ నెల కూడా ఉద్యోగుల జీతాల్లో 50 శాతం, ప్రజాప్రతినిధుల వేతనాల్లో 75 శాతం కోత ఉంటుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. అయితే ఫ్యామిలీ పెన్షనర్లకు మాత్రం 75 శాతం వేతనాలు చెల్లించాలని నిర్ణయించామని చెప్పారు. వాస్తవ పెన్షనర్లు చనిపోయి, వారిపై ఆధారపడిన వారు తమకు 50 శాతం వేతనం సరిపోవడంలేదని, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు తన దృష్టికి తీసుకువచ్చారని కేసీఆర్ వివరించారు. అందుకే ఫ్యామిలీ పెన్షనర్లకు ఈసారి 75 శాతం ఇవ్వాలని నిర్ణయించినట్టు వెల్లడించారు.
వైద్య సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది, హెచ్ఎండబ్ల్యూ సిబ్బంది, గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య సిబ్బందికి గతంలో ఇచ్చిన విధంగానే నగదు ప్రోత్సాహకం ఏప్రిల్ నెలకు కూడా వర్తింపజేస్తున్నామని, పోలీసులకు సైతం ఈ నెల జీతం ఇచ్చేటప్పుడు 10 శాతం సీఎం కానుకగా ఇవ్వాలని క్యాబినెట్ నిర్ణయించినట్టు తెలిపారు. విద్యుత్ కార్మికులు సైతం అద్భుతమైన సేవలు అందించారని, వారికి పూర్తి జీతం ఇస్తున్నామని వెల్లడించారు.