కొన్ని కేసులు మిస్సయ్యాం.. అంటూ వూహాన్ లో మరణాల సంఖ్యను 50 శాతం పెంచిన చైనా!
- వూహాన్ లో మరో 1,290 మంది చనిపోయినట్టు అధికారుల ప్రకటన
- కొన్ని మరణాలు రికార్డుల్లోకి ఎక్కలేదని వివరణ
- 4,632కి చేరుకున్న చైనా మరణాల సంఖ్య
చైనాలోని కరోనా మరణాలపై ప్రపంచ దేశాలు అనుమానాలను వ్యక్తపరుస్తున్న తరుణంలో... ఆ దేశం వూహాన్ లో మరణాల సంఖ్యను పెంచడం గమనార్హం. కొన్ని కారణాల వల్ల ఈ మరణాలు రికార్డుల్లోకి ఎక్కలేదని అధికారులు ఈ సందర్భంగా వివరణ ఇచ్చారు. వూహాన్ లో కరోనా విజృంభిస్తున్న సమయంలో మెడికల్ స్టాఫ్ తీవ్ర గందరగోళానికి గురయ్యారని... దీని కారణంగా మరణాలకు సంబంధించి కొన్ని రిపోర్టులు మిస్ అయ్యాయని, మరికొన్ని ఆలస్యంగా రికార్డుల్లోకి చేర్చబడ్డాయని చెప్పారు. కొందరు తమ ఇళ్లలోనే ప్రాణాలు కోల్పోయారని... వీరి వివరాలు కూడా రికార్డుల్లోకి ఎక్కలేదని తెలిపారు.