పొదుపు ఖాతాలపై వడ్డీని తగ్గించిన ఎస్బీఐ!
- 3 శాతం నుంచి 2.75 శాతానికి తగ్గింపు
- ఏప్రిల్ 15 నుంచి అమలులోకి
- నెల రోజుల వ్యవధిలో రెండోమారు తగ్గింపు
ఇక కనీస నెలవారీ బ్యాలెన్స్ ను తొలగిస్తున్నట్టు బ్యాంకు గతంలోనే ప్రకటించింది. ఇదే సమయంలో అన్ని రకాల కాలపరిమితుల డిపాజిట్లపై ఎంసీఎల్ఆర్ (మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ - లెండింగ్ రేట్) ను 35 బేసిస్ పాయింట్లు తగ్గించిన సంగతి తెలిసిందే. ఒక సంవత్సరం ఎంసీఎల్ఆర్ ను 7.75 శాతం నుంచి 7.40 శాతానికి తగ్గిస్తున్నామని, ఈ నిర్ణయం ఏప్రిల్ 10 నుంచి అమలులోకి వస్తుందని పేర్కొంది.
ఈ నిర్ణయంతో రూ. లక్ష గృహ రుణం తీసుకుని, 30 సంవత్సరాల కాలపరిమితిని ఎంచుకున్న వారికి, నెలకు రూ. 24 మేరకు వడ్డీ భారం తగ్గనుంది. అక్టోబర్ 1, 2019 తరువాత తీసుకున్న రిటైల్ రుణాలకు మాత్రం ఈ వెసులుబాటు ఉండదని బ్యాంకు స్పష్టం చేసింది. గత నెలలో పరపతి సమీక్ష తరువాత ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించిన నేపథ్యంలో పలు బ్యాంకులు డిపాజిట్లు, రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించిన సంగతి తెలిసిందే. ఆర్బీఐ 75 బేసిస్ పాయింట్ల మేరకు రెపో రేటును తగ్గించగా, వివిధ బ్యాంకులు పావు నుంచి అర శాతం మేరకు రుణాలపై వడ్డీని తగ్గించాయి.