చైనా పక్కనే ఉన్న ఈ చిన్న దేశాన్ని కరోనా ఏమీ చేయలేకపోయింది!
- వియత్నాంలో కరోనా పాజిటివ్ కేసులు రెండు వందల్లోపే!
- మృతుల సంఖ్య సున్నా
- చైనా కంటే ముందే లాక్ డౌన్ ప్రకటించిన వియత్నాం
వాస్తవానికి వియత్నాం మధ్యతరహా దేశం. వైద్య వ్యవస్థ ఆధునికతను ఇంకా అందిపుచ్చుకోలేదు. అయితేనేం, దార్శనికత విషయంలో పెద్ద దేశాలకు తీసిపోదు. కరోనాను సమర్థంగా కట్టడి చేయడమే అందుకు నిదర్శనం. చైనాలో కరోనా ప్రభావం గణనీయంగా ఉన్న తరుణంలో వియత్నాం మేల్కొంది. చైనాతో సరిహద్దును మూసేసింది. కరోనా జన్మస్థానం చైనాలో లాక్ డౌన్ జనవరి 20న ప్రారంభం కాగా, జనవరి 1 నుంచే వియత్నాం దశలవారీ లాక్ డౌన్ అమలు చేయడం మొదలుపెట్టింది.
మొదట వ్యాధిగ్రస్తులను గుర్తించి క్వారంటైన్ కేంద్రాలకు తరలించారు. ఆపై వారు సంచరించిన ప్రదేశాలు, కలిసిన వ్యక్తుల వివరాలు తెలుసుకుని భారీ ఎత్తున పరీక్షలు నిర్వహించారు. ఉగ్రవాదంపై నిఘా తరహాలో కరోనా అనుమానితుల కోసం ఇంటెలిజెన్స్ వర్గాలు వేట సాగించాయి. ఇంట్లోనే ఉండడం ద్వారా కరోనాను రూపుమాపగలమంటూ విస్తృతస్థాయిలో ప్రభుత్వ వర్గాలు సామాజిక ప్రచారం చేశాయి. శానిటైజర్లు, మాస్కులను ప్రభుత్వమే సరఫరా చేసింది. కేవలం మూడ్నాలుగు వారాల్లోనే పరిస్థితి అదుపులోకి వచ్చింది. కొత్త కేసులేవీ నమోదు కాకపోవడంతో లాక్ డౌన్ ఎత్తివేశారు.