కుంటిసాకు చెప్పి ఎన్నికలు వాయిదా వేయడాన్ని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు: స్పీకర్ తమ్మినేని

  • ప్రభుత్వానికి సూచనలు చేయడం వరకే ఎస్ఈసీ విధి 
  • పాలనలో ఎలా జోక్యం చేసుకుంటారని ప్రశ్న 
  • ఇక సీఎం ఎందుకంటూ అసహనం
ప్రపంచవ్యాప్తంగా ప్రాణాంతకంగా మారిన కరోనా వైరస్ ఏపీలో తీవ్ర రాజకీయ దుమారానికి కారణమైంది. కరోనా కారణంగా స్థానిక సంస్థల ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల సంఘం వాయిదా వేసిన సంగతి తెలిసిందే. దీనిపై వైసీపీ, టీడీపీ నేతల మధ్య తీవ్రస్థాయిలో విమర్శల దాడి జరుగుతోంది.

తాజాగా ఈ అంశంపై అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం స్పందించారు. ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వడం, విధివిధానాలు అమలు చేయడం వరకే రాష్ట్ర ఎన్నికల కమిషన్ పాత్ర ఉంటుందని, ఇతరత్రా విపత్తులు ఏర్పడినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం యంత్రాంగంతో సంప్రదించి, ప్రభుత్వ సూచనల మేరకే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

ప్రభుత్వానికి సూచనలు చేయడం వరకే ఎస్ఈసీ పరిధి ఉంటుందని, పాలనలో ఎలా జోక్యం చేసుకుంటుందని ప్రశ్నించారు. అయినా రాష్ట్ర పాలనలో ఎన్నికల కమిషనర్ జోక్యం చేసుకుంటే సీఎం ఎందుకని అన్నారు. ఎవరినీ సంప్రదించకుండా, ఓ కుంటిసాకు చెప్పి ఎన్నికలు వాయిదా వేయడం చూసి రాష్ట్రంలో ప్రజలు నవ్వుకుంటున్నారని వ్యాఖ్యానించారు.

Tammineni Sitaram
SEC
Local Body Polls
Andhra Pradesh

More Telugu News