తనను ఎవరూ మర్చిపోకూడదని.. బతికుండగానే విగ్రహాలను తయారు చేయించుకున్న ఎమ్మెల్యే

పశ్చిమ బెంగాల్‌కు చెందిన తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జయంత్‌ నాస్కర్‌ (71)కు తనను ప్రత్యర్థులు చంపేస్తారేమోనన్న భయం పట్టుకుంది. ఒకవేళ తనను హత్య చేస్తే తనను ప్రజలెవరూ మరిచిపోకూడదనే ఉద్దేశంతోనే ఆయన స్వయంగా విగ్రహాలు తయారు చేయించున్నారు.

ఇటీవల ఆయన ఇంట్లో ఓ సమావేశం జరిగింది. ఇందులో పాల్గొన్న కార్యకర్తలు ఎమ్మెల్యే విగ్రహాలు చూసి షాక్‌ అయ్యారు. కొందరు ఆ విగ్రహాల ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇటీవల అలీపూర్‌ సెంట్రల్‌ కరెక్షన్‌ హోమ్‌ నుంచి నలుగురు నేరస్తులు తప్పించుకున్నారని, వారితో తనను హత్య చేయించేందుకు స్థానిక నాయకులు సుపారీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు.

అందుకే తనకు ఇటీవల భద్రత పెంచారని చెప్పారు. ఒకవేళ తాను చనిపోతే ఈ విగ్రహాలను ఎక్కడ పెట్టాలన్న విషయం ప్రజల ఇష్టమని ఆయన చెప్పారు. అంతేగాక,  సొంత పార్టీలోనూ తనకు శత్రువులున్నారని ఆయన చెప్పుకొచ్చారు.


More Telugu News