ఏపీ ‘స్థానిక‘ ఎన్నికల్లో అన్ని స్థానాల్లోనూ కాంగ్రెస్​ పోటీ చేస్తుంది: శైలజానాథ్​

  • ఏఐసీసీ సభ్యుడు ధృవకుమార్ రెడ్డి ఇంటికి వెళ్లిన సాకే
  • పులివెందులలో ‘కాంగ్రెస్’కి పూర్వ వైభవం తీసుకొస్తా
  • సీఏఏ, ఎన్ఆర్సీలపై జగన్ ద్వంద్వ వైఖరి వీడాలి 
ఏపీలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల నుంచి తమ పార్టీ పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సాకే శైలజానాథ్ వెల్లడించారు. కడప జిల్లా వేంపల్లెలోని ఏఐసీసీ సభ్యుడు ధృవకుమార్ రెడ్డి ఇంటికి ఆయన వెళ్లారు. ఈ సందర్భంగా విలేకరులతో ఆయన మాట్లాడుతూ, పులివెందుల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తామని అన్నారు.

ఏపీ సీఎం, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ పాలనలో ప్రజలకు ఏమి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. సీఏఏ, ఎన్ఆర్సీలపై జగన్ ద్వంద్వ వైఖరి విడనాడాలని విమర్శించారు. ఈ సందర్భంగా వేంపల్లిలోని ఎంహెచ్పీఎస్, ఆమ్ ఆద్మీ పార్టీల నాయకులు ఆయన్ని సన్మానించారు. సీఏఏ, ఎన్ఆర్సీలను నిరసిస్తూ ఆయనకు ఓ వినతిపత్రం అందజేశారు.

Sake Sailajanath
Congress
Local body elections

More Telugu News