హైదరాబాద్లో మరో ఇద్దరికి కరోనా పాజిటివ్!
- గాంధీ ఆసుపత్రి పరీక్షల్లో వెల్లడి
- పుణె ఎన్ఐవీకి శాంపిల్స్
- మిగతా 45 మంది అనుమానితుల రిపోర్టులు నెగిటివ్
ఈ ఇద్దరిలో ఒకరు వైరస్ బారిన పడిన సాఫ్ట్వేర్ ఉద్యోగితో కాంటాక్ట్ అయిన వ్యక్తి కాగా, మరొకరు ఇటలీకి వెళ్లొచ్చినట్టుగా గుర్తించారు. సాఫ్ట్వేర్ ఉద్యోగితో కాంటాక్ట్ అయిన వారితో సహా మంగళవారం మొత్తం 47 మంది అనుమానితులకు కరోనా పరీక్షలు చేయగా 45 మంది రిపోర్టులు నెగిటివ్గా వచ్చాయి. వాళ్లందరినీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశామని, 14 రోజుల పాటు తమ నివాసాల్లో ఐసోలేషన్లో ఉండాలని సూచించినట్టు గాంధీ ఆసుపత్రి ప్రజారోగ్య డైరెక్టర్ డాక్టర్ జి. శ్రీనివాస్ రావు తెలిపారు. ఇక, కరోనా బారిన పడి గాంధీ ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్న సాప్ట్వేర్ ఉద్యోగి ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు.