బ్రహ్మదేవుడు కూడా చంద్రబాబును కాపాడలేడు: అంబటి రాంబాబు జోస్యం

తన మాజీ పీఎస్ శ్రీనివాస్ పై ఐటీ దాడుల ఘటనకు సంబంధించి చంద్రబాబు సమాధానం చెప్పుకోలేకపోతున్నారని, బ్రహ్మదేవుడు కూడా దీని నుంచి ఆయన్ని కాపాడలేరని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు జోస్యం చెప్పారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ కథ ఇంతటితో ముగిసేది కాదని, ‘లాజికల్ గా ఎండ్’ కావాలని, వాస్తవాలు బయటకొస్తాయని, చాలా మందికి ఈ వ్యవహారం చుట్టుకుంటుందని అన్నారు. అన్యాయంగా, అక్రమంగా వేల కోట్లు దోచుకున్న చంద్రబాబునాయుడి గుట్టురట్టు కాబోతున్న సమయం ఆసన్నమైందని వ్యాఖ్యానించారు.

ఇంకా చాలా సోదాలు జరగాల్సిన అవసరం ఉందని, ఇలా ఒకటి లేదా రెండు సంవత్సరాలు జరిగే అవకాశాలు ఉన్నాయని, ఈ క్రమంలో చంద్రబాబునాయుడిని కూడా ఇన్ కంట్యాక్స్ డిపార్టుమెంట్ విచారిస్తుందని భావిస్తున్నానని అన్నారు. చంద్రబాబు మాజీ ముఖ్యమంత్రి అనో, కేంద్రంలో చక్రం తిప్పారనో విచారించకుండా ఉండాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. చంద్రబాబునాయుడు దొరికిపోతారని, శిక్ష నుంచి ఆయన తప్పించుకోవడం సాధ్యం కాదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.  

Ambati Rambabu
YSRCP
Chandrababu
Telugudesam

More Telugu News