పోలీసుల ఆంక్షలపై మందడం రైతుల ఆగ్రహం

అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ శాంతియుతంగా ఆందోళన చేస్తున్న తమపై పోలీసులు మళ్లీ ఆంక్షలు మొదలు పెట్టడం అన్యాయమని మందడం రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు. రాజధాని కోసం రైతులు చేబట్టిన నిరసన 56వ రోజుకి చేరింది. ఈ రోజు కూడా రైతులు పలు రూపాల్లో ఆందోళనలు కొనసాగించారు. దీంతో తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుంచి సచివాలయానికి వెళ్లే మార్గంలో భారీగా పోలీసులు మోహరించారు. 

మందడం దీక్షా శిబిరం వద్ద పరదాలు ఏర్పాటు చేశారు. శిబిరం నుంచి ఎవరూ బయటకు రాకుండా బారికేడ్లు, ఇనుప కంచె నిర్మించారు. గతంలో ఎప్పుడూ ఈ పరిస్థితి లేదని రైతులు మండిపడ్డారు. ఆంక్షలకు భయపడమని, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానుల నిర్ణయం వెనక్కి తీసుకునే వరకు పోరాడుతామని స్పష్టం చేశారు.



More Telugu News