చివరి టి20 కూడా టీమిండియాదే... కివీస్ కు తప్పని వైట్ వాష్

  • టీమిండియా స్కోరు 163/3
  • లక్ష్యఛేదనలో 9వికెట్లకు 156 పరుగులే చేసిన న్యూజిలాండ్
  • 5-0తో సిరీస్ భారత్ కైవసం
న్యూజిలాండ్ తో చివరిదైన ఐదో టి20 మ్యాచ్ లో టీమిండియా జయకేతనం ఎగురవేసింది. కివీస్ విజయానికి చివరి ఓవర్లో 21 పరుగులు అవసరం కాగా, ఇష్ సోధీ సిక్సర్లతో విరుచుకుపడినా శార్దూల్ ఠాకూర్ నిబ్బరంతో బౌలింగ్ వేయడంతో భారత్ 7 పరుగుల తేడాతో గెలుపు తీరాలకు చేరింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 3 వికెట్లకు 163 పరుగులు చేయగా, లక్ష్యఛేదనలో న్యూజిలాండ్ 9 వికెట్లకు 156 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. కివీస్ ఇన్నింగ్స్ లో వికెట్ కీపర్ టిమ్ సీఫెర్ట్ 50, రాస్ టేలర్ 53 పరుగులు చేశారు.

అయితే, చివరి ఓవర్లో ఇష్ సోధీ ఊపు చూస్తే ఆతిథ్య జట్టు గెలుస్తుందనే అనిపించింది. రెండు భారీ సిక్సర్లతో టీమిండియా శిబిరంలో గుబులు రేపాడు. అయితే, చివరి రెండు బంతుల్లో భారీ షాట్లు కొట్టలేకపోవడంతో టీమిండియా ఊపిరిపీల్చుకుంది.

ఓ దశలో కివీస్ సజావుగానే లక్ష్యఛేదన చేస్తుందనిపించినా, బుమ్రా కీలక సమయాల్లో వికెట్లు తీసి ఆ జట్టుపై ఒత్తిడి పెంచాడు. ఈ మ్యాచ్ లో బుమ్రాకు 3, సైనీకి 2, ఠాకూర్ కు 2 వికెట్లు దక్కాయి. సుందర్ ఓ వికెట్ తీశాడు. మౌంట్ మాంగనుయ్ లో జరిగిన ఈ మ్యాచ్ ను నెగ్గడం ద్వారా భారత్ ఈ సిరీస్ లో 5-0తో కివీస్ ను వైట్ వాష్ చేసినట్టయింది.



Go Back to Shorts
Team India
Team New Zealand
T20
White Wash
5-0

More Telugu News