'సీఏఏ' అనుకూల, ప్రతికూల వర్గాల మధ్య ఘర్షణ.. ఇద్దరి మృతి
- బెంగాల్ లోని జాలంగిలో బంద్ కు పిలుపునిచ్చిన సీఏఏ వ్యతిరేకులు
- బంద్ ను నిరసించిన సీఏఏ అనుకూల వర్గాలు
- హింసకు కాంగ్రెస్,సీపీఎం కారణమన్న టీఎంసీ నేతలు
వివరాలు ఇలా ఉన్నాయి. ముర్షీదాబాద్ జిల్లా జాలంగి ప్రాంతంలో సీఏఏకు వ్యతిరేకంగా స్థానికులు బంద్ కు పిలుపునిచ్చారు. అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత తహిరుద్దీన్ షేక్ ఆధ్వర్యంలో ఓ వర్గం ఈ బంద్ చేపట్టింది. దీన్ని వ్యతిరేకిస్తూ.. మరో వర్గం ఆందోళనకు దిగడంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. ఆందోళనకారులు పలు వాహనాలను ధ్వంసం చేశారు. దీన్ని టీఎంసీ నేతలు ఖండిస్తూ.. స్థానిక కాంగ్రెస్, సీపీఎం మద్దతుదారులు కుట్ర పూరితంగా హింసకు పాల్పడ్డారని ఆరోపించారు. మృతులను అనిరుధ్ బిస్వాస్, మఖ్యూల్ షేక్ గా గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు.