మండలి రద్దుపై అసెంబ్లీలో ఓటింగ్... తీర్మానానికి ఏకగ్రీవంగా ఆమోదం!

ఏపీ అసెంబ్లీలో అధికార వైసీపీ తమ పంతం నెగ్గించుకుంది. శాసనమండలి రద్దు తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం లభించింది. సీఎం జగన్ సభలో మండలి రద్దు తీర్మానం ప్రవేశపెట్టి చర్చ నిర్వహించారు. ఆపై, మండలి రద్దు తీర్మానంపై స్పీకర్ తమ్మినేని సీతారాం ఓటింగ్ నిర్వహించగా, తీర్మానానికి అనుకూలంగా సభలో ఉన్న సభ్యులంతా లేచి నిలబడ్డారు. అసెంబ్లీ సిబ్బంది వారిని లెక్కించగా 133 మంది లెక్క తేలింది.

 ఇక వ్యతిరేకంగానూ, తటస్థంగానూ ఎవరూ లేకపోవడంతో తీర్మానానికి సభ ఆమోదం లభించిందని ప్రకటించారు. ఆమోదం పొందిన ఈ రద్దు తీర్మానాన్ని కేంద్రానికి పంపనున్నారు. కాగా, ఓటింగ్ ప్రక్రియ అనంతరం సభ నిరవధికంగా వాయిదా పడింది. కాగా నేటి సభా సమావేశాలకు టీడీపీ దూరంగా ఉన్న సంగతి తెలిసిందే.


More Telugu News