రాజధాని భవనాలను కూడా ప్రజా వేదికలాగా కూల్చేస్తారా?: లోకేశ్

వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత నారా లోకేశ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఒకవేళ రాజధాని మారితే అమరావతిలోని భవనాలను కూడా ప్రజా వేదికలాగే కూల్చేస్తారా? అని ఆయన ప్రశ్నించారు. 'సెక్రటేరియట్, శాసనసభ, శాసనమండలి, రాజభవన్‌, హైకోర్టు, వివిధ ప్రభుత్వ శాఖల కార్యాలయాలు, హెచ్‌వోడీ భవనాలు, ఇలా పరిపాలనకు కావాల్సిన సమస్తం ఆధునిక సౌకర్యాలతో ఇప్పటికే రూపుదిద్దుకున్నాయి' అని అన్నారు.

'గత మూడేళ్లుగా, పరిపాలన అంతా ఇక్కడ నుంచే సాగుతోంది. ఒక్క రూపాయి కూడా ఖర్చు చెయ్యకుండా, పరిపాలన ఇక్కడ నుంచి కొనసాగించవచ్చు. అన్నీ అమరిన తర్వాత ఇప్పుడు అమరావతి నుంచి రాజధానిని తరలించాల్సిన అవసరం ఏముంది?' అని ప్రశ్నిస్తూ లోకేశ్ ట్వీట్లు చేశారు.

'రాజధాని మారితే ఈ భవనాలను ఏం చేస్తారు ? వీటిని కూడా ప్రజా వేదిక లాగా కూల్చేస్తారా ? ఉన్నవి పీకేసి, కొత్త వాటి కోసం అదనంగా ఖర్చు చెయ్యటం, తుగ్లక్ నిర్ణయం కాదా?' అని లోకేశ్ నిలదీశారు.


More Telugu News