అలాంటి నివేదిక ఏదీ తాము ఇవ్వలేదని మద్రాస్ ఐఐటీ తేల్చి చెప్పింది.. అంటే ఇది మీ విష ప్రచారం కాదా?: వైసీపీపై నారా లోకేశ్ మండిపాటు

భారీ నిర్మాణాలకు అమరావతి అనువు కాదంటూ ఐఐటీ మద్రాస్ నివేదిక ఇచ్చిందన్న వైసీపీ ప్రకటనలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అలాంటి నివేదిక ఏదీ తాము ఇవ్వలేదని ఐఐటీ మద్రాస్ తేల్చి చెప్పిందని ఆయన పేర్కొన్నారు. దీంతో అమరావతిపై వైసీపీ చేస్తున్నదంతా విష ప్రచారమేనని తేటతెల్లమైందన్నారు.

‘ఒక అమరావతి, వైసీపీ 10 అబద్ధాలు’ పేరుతో ట్వీట్ చేసిన లోకేశ్.. వైసీపీని ఎండగట్టారు. ప్రజా రాజధాని అయిన అమరావతి గురించి నిజాలు చెప్పేలోపు.. వైసీపీ చెప్పే అబద్ధాలు ప్రపంచాన్ని చుట్టి వచ్చేస్తున్నాయని అన్నారు. అమరావతిని చంపేందుకు వైసీపీ చేస్తున్న కుట్రలు, కుతంత్రాలు అన్నీ ఇన్నీ కావని మండిపడ్డారు. ఐఐటీ మద్రాస్ వివరణతో నిజాలను ఎక్కువకాలం దాయలేమన్న విషయం జగన్‌కు అర్థమై ఉంటుందన్నారు. ఈ సందర్భంగా చేసిన ట్వీట్‌లో అమరావతిపై వైసీపీ వివిధ సందర్భాల్లో చేసిన విమర్శలను అంశాల వారీగా లోకేశ్ ప్రస్తావించారు.


More Telugu News