కేసీఆర్ పాలనను మెచ్చుకుంటున్న మహిళలు తమ ఇళ్ల ముందు కారు గుర్తు ముగ్గులేసుకుంటున్నారు: పల్లా రాజేశ్వర్ రెడ్డి

  • అన్ని హామీలు అమలు చేస్తున్నామని వెల్లడి
  • పట్టణాలు మరింత అభివృద్ధి చెందుతున్నాయన్న పల్లా
  • విపక్షాలకు అభ్యర్థుల్లేరంటూ ఎద్దేవా
మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలన్నింటినీ టీఆర్ఎస్ సర్కారు దాదాపు అమలు చేస్తోందని రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్ పాలనలో పట్టణాలు మరింతగా అభివృద్ధి చెందుతున్నాయని, ఆ విషయం ప్రజలందరూ చూస్తున్నారని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ పాలనకు మెచ్చి మహిళలందరూ తమ ఇళ్ల ముందు కారు గుర్తు ముగ్గులు వేసుకుంటున్నారని వెల్లడించారు.

హైదరాబాద్ శివారు ప్రాంతాలకు సైతం క్రమం తప్పకుండా మంచినీరు సరఫరా చేస్తున్నామని చెప్పారు. 75 గజాల వరకు స్థలంలో ఎలాంటి అనుమతులు అవసరం లేకుండా ఇల్లు కట్టుకునే సౌలభ్యం కల్పించామని, ఇలాంటి సదుపాయం ఏ రాష్ట్రంలోనూ లేదని అన్నారు. ఈసారి పురపాలక ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ కు ఎదురుండదని పల్లా రాజేశ్వర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. విపక్షాల తరఫున పోటీ చేసేందుకు అభ్యర్థులు కూడా లేరని, కానీ టీఆర్ఎస్ తరఫున బరిలో దిగేందుకు ఒక్కోస్థానంలో ముగ్గురు, నలుగురు పోటీపడుతున్నారని వివరించారు.
Go Back to Shorts
Palla Rajeshwar Reddy
TRS
Telangana
Car
Congress
BJP

More Telugu News