నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రాకు ఈడీ నోటీసులు!
- ఇక్బాల్ మిర్చి కేసులో ఆరోపణలు
- ముంబైలో విచారించనున్న అధికారులు
- కేసులో ఇప్పటికే రజనీత్ బింద్రా అరెస్ట్
ఈ కేసులో రాజ్ కుంద్రా స్టేట్ మెంట్ ను రికార్డు చేయాల్సి వున్నందున ముంబైలోని విచారణ అధికారుల ముందు హాజరు కావాలని నోటీసులు పంపినట్టు ఓ అధికారి వెల్లడించారు. ఇదే కేసులో బాస్టియన్ హాస్పిటాలిటీ పేరిట గతంలో ఓ సంస్థను నిర్వహించిన రజనీత్ బింద్రాకు ప్రమేయం ఉందని, రజనీత్ తో కుంద్రా దగ్గరి సంబంధాలను నెరిపాడని అధికారులు అంటున్నారు. వీరిద్దరి మధ్య జరిగిన వ్యాపార లావాదేవీలను బయటకు తీయాల్సిన అవసరం ఉందని అధికారులు భావిస్తున్నారు.
కాగా, ఇదే కేసులో గతంలో బింద్రాను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దావూద్ ఇబ్రహీంకు సన్నిహితుడైన ఇక్బాల్ మిర్చి, 2013లో లండన్ లో గుండెపోటుతో మరణించాడు. ఆయనపై ఎన్నో కేసులు పెండింగ్ లో ఉన్నాయి. ముంబైలోని అత్యంత ఖరీదైన నివాస ప్రాంతాల్లో ఇళ్లు, స్థలాల కొనుగోలు, అమ్మకాల్లో భాగం పంచుకున్న ఇక్బాల్, అతని కుటుంబీకులు, ఇతరులపై కేసులు నమోదు చేసిన ఈడీ, ప్రస్తుతం వాటిని విచారిస్తోంది.