ఈ ప్రశ్నకు సీఎం జగన్, ఆయన పార్టీ తప్పకుండా సమాధానం చెప్పాలి!: జీవీఎల్

  • ఓడిపోయిన టీడీపీతో అనుబంధం మాకెందుకు?
  • ఏపీలో ఓ శక్తిగా ఎదగాలని అనుకుంటున్నాం
  • వేరే పార్టీని ఉద్ధరించాల్సిన అవసరం మాకు లేదు
ఓడిపోయిన తెలుగుదేశం పార్టీతో అనుబంధం పెంచుకోవాల్సిన అవసరం తమ పార్టీకి లేదని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏపీలో ఓ శక్తిగా ఎదగాలని తాము అనుకుంటామే తప్పా, వేరే పార్టీని ఉద్ధరించాల్సిన అవసరం తమకు లేదని స్పష్టం చేశారు. ఏపీలో ఏ పార్టీతోనూ కలిసి వెళ్లే ఉద్దేశం బీజేపీకి కచ్చితంగా లేదని అన్నారు.

ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు గురించి ఆయన ప్రస్తావించారు. ఈ ప్రాజెక్టు విషయంలో తప్పులు జరిగాయని గతంలో తాము చెప్పామని, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చెబుతోందని అన్నారు. రూ.2,200 కోట్ల అవినీతి జరిగిందని చెబుతున్న ప్రభుత్వం దీనిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని మరోమారు ప్రశ్నిస్తున్నట్టు చెప్పారు. ఈ ప్రశ్నకు సీఎం జగన్, ఆయన పార్టీ తప్పకుండా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

రాజధాని అమరావతి విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వానికి తమ డిమాండ్ ఇదే అని, గత ప్రభుత్వం ఎక్కువ ధరకు భూములను కొనుగోలు చేసి, తక్కువ ధరకు ఈ భూములను ఎవరికి కేటాయించారన్న సమాచారం రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంది కదా, తప్పు ఎవరైతే చేశారో వారిపై చర్యలు తీసుకోకుండా ఎందుకు నీళ్లు నములుతోంది? అని ప్రశ్నించారు.
Go Back to Shorts
Andhra Pradesh
Telugudesam
BJP
mp
gvl

More Telugu News