ఓ వ్యక్తిని చిత్రహింసలకు గురి చేసిన కేసు.. చింతమనేనిని కోర్టులో ప్రవేశపెట్టనున్న పోలీసులు
- చింతమనేనిని వెంటాడుతున్న వరుస కేసులు
- మరో కేసులో ఈరోజు కోర్టులో ప్రవేశపెట్టనున్న పోలీసులు
- మాజీ సర్పంచ్ మేడికొండ వెంకట కృష్ణారావుపై దాడి చేసినట్టు ఆరోపణలు
టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను వరుస కేసులు వెంటాడుతున్నాయి. తాజాగా ఆయనకు కోర్టు విధించిన రిమాండ్ ముగిసింది. దీంతో, జిల్లా జైల్లో ఉన్న ఆయనను కోర్టులో పోలీసులు ప్రవేశపెట్టనున్నారు. మాజీ సర్పంచ్ మేడికొండ వెంకట కృష్ణారావు అనే వ్యక్తిపై దాడి చేసిన మరో కేసులో కోర్టులో హాజరుపరచనున్నారు. కేసు వివరాల్లోకి వెళ్తే, పెదవేగి మండలం గార్లమడుగు గ్రామ సమీపంలోని పోలవరం కుడికాలువ గట్టు మట్టి తరలింపు వ్యవహారంపై ఇరిగేషన్ అధికారులకు కృష్ణారావు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో, కృష్ణారావును చింతమనేని తన ఇంటికి తీసుకెళ్లి, చిత్రహింసలకు గురి చేశాడని ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై 2018లో పెదవేగి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.