పెద్దలకు భయపడి ప్రాణాలు తీసుకున్న ప్రేమికులు?

ప్రేమ బాసలు చేసుకున్నారు. ఓ ఇంటివారై జీవితాన్ని అనుభవించాలని కలలు కన్నారు. కానీ కులాంతరం ఉండడంతో పెద్దల వ్యవహారమే తమ పెళ్లికి ఆటంకం అవుతుందేమోనన్న భయంతో చివరికి ప్రాణాలు తీసుకుని ఒక్కటిగా వెళ్లిపోయారు.

వివరాల్లోకి వెళితే...కర్నూల్‌ జిల్లా పెద్ద ముడియం మండలం దిగువ కల్వటాల గ్రామానికి చెందిన మనోజ్‌కుమార్‌ (20), అదే మండలం కొండసుంకేసులకు చెందిన వెంకటక్ష్మి (19) కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. జమ్మలమడుగులోని ఓ ప్రైవేటు పాఠశాలలో మనోజ్‌ డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతుండగా, వెంకటలక్ష్మి మొదటి సంవత్సరం విద్యార్థిని. ఇద్దరి కులాలు వేరు. దీంతో తమ పెళ్లికి పెద్దలు అంగీకరించరేమోనన్న భయం వారికి పట్టుకుంది. ఈ నేపథ్యంలో కుటుంబ పరంగా ఏం జరిగిందో ఏమోగాని రెండు రోజుల క్రితం ఇద్దరూ కలిసి ఆళ్లగడ్డ మండలం ఎగువ అహోబిలం వైపు వెళ్లడం స్థానికులు చూశారు.

నిన్న కొందరు అటువైపు వెళ్తూ అటవీ ప్రాంతంలో విగత జీవులుగా పడివున్న వీరిని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలంలో గుర్తింపు కార్డు, పురుగుల మందు డబ్బా కనిపించాయి. దీంతో ఇంట్లో పెద్దలు వీరు పెళ్లికి అంగీకరించక పోవడంతో చనిపోయి ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు.
Go Back to Shorts
Kurnool District
lovers suicide
ahobilam

More Telugu News