100 తడబాట్లు... 100 తప్పటడుగులు!... జగన్ వంద రోజుల పాలనపై డొక్కా విమర్శలు

టీడీపీ నేత, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ ఏపీ సర్కారు తీరుపై విమర్శనాస్త్రాలు సంధించారు. సీఎంగా జగన్ వంద రోజుల పాలన 100 తప్పటడుగులు, 100 తడబాట్లుగా సాగుతోందని ఎద్దేవా చేశారు. చంద్రబాబునాయుడుపై కక్షతో మిడిల్ క్లాస్ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ విమర్శించారు. 100 రోజుల నుంచి ఉపాధి లేక కార్మికులు అల్లాడిపోతున్నారని, వారిని ఏ విధంగా ఆదుకుంటారో చెప్పాలని నిలదీశారు.

ఇసుక టెండర్లను వైసీపీ వాళ్లకు ఇవ్వడం సిగ్గుచేటని పేర్కొన్న డొక్కా, సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్లడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. గుంటూరు టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జగన్ తన వంద రోజుల పాలనలో కనీసం 30 మార్కులు కూడా తెచ్చుకోలేదని టీడీపీ నేత వ్యంగ్యం ప్రదర్శించారు.


More Telugu News