హైదరాబాద్ ఐటీ ఉద్యోగులకు శుభవార్త... ఇకపై మూడు నిమిషాలకో మెట్రో!
- హైటెక్ సిటీ మార్గంలో అందుబాటులోకి వచ్చిన రివర్సల్ సదుపాయం
- పీక్ అవర్స్ లో మూడు నిమిషాలకో మెట్రో రైల్
- వెల్లడించిన హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి
ఇటీవలి కాలం వరకూ హైటెక్ సిటీ మార్గంలో రివర్సల్ సదుపాయం లేకపోవడంతో రైళ్లు కాస్తంత ఆలస్యంగా నడిచాయని, ఇప్పుడా సదుపాయం కూడా అందుబాటులోకి వచ్చిందని అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ మార్గంలో సగటున 5 నుంచి 6 వేల మంది వరకూ ప్రయాణికుల సంఖ్య పెరుగుతోందని, గత బుధవారం ఏకంగా 3.06 లక్షల మంది ప్రయాణించారని హెచ్ఎంఆర్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు.
హైటెక్ సిటీ నుంచి - రాయదుర్గం జంక్షన్ వరకూ మెట్రో పట్టాల నిర్మాణం, సిగ్నలింగ్ తదితర పనులు పూర్తయ్యాయని, ఈ మార్గంలో ట్రయల్ రన్ నెలాఖరు నుంచి ప్రారంభం అవుతుందని ఆయన తెలిపారు. ఇక పెండింగ్ లో ఉన్న ఎంజీబీఎస్ - జేబీఎస్ మార్గంలోని 10 కిలోమీటర్ల దూరం మెట్రో రైల్, డిసెంబర్ నాటికి ప్రజలకు అందుబాటులోకి వస్తుందని తెలిపారు.